సామూహిక అత్యాచార యత్నం.. తప్పించుకున్న బాలిక!

  • 9వ తరగతి బాలిక వెంటపడుతున్న విజయ్ 
  • ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానని హెచ్చరిక
  • ఇద్దరు స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారయత్నం
తొమ్మిదో తరగతి బాలిక సామూహిక అత్యాచారం నుంచి బయటపడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరులోని ఒక ప్రాంతానికి చెందిన బాలిక స్థానిక స్కూల్ లో 9వ తరగతి చదువుతోంది. ఆమెను ప్రేమిస్తున్నానంటూ విజయ్ అనే యువకుడు గత కొంతకాలంగా వెంటబడుతున్నాడు. మూడు రోజుల క్రితం ఆమెను వెంబడించిన విజయ్.. తనను ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.

ఈ క్రమంలో బాలిక గతరాత్రి ఇంటికి దగ్గర్లోని ఒక దుకాణానికి వెళ్లి వస్తుండగా, విజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె నోరు మూసి బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లాడు. అతని స్నేహితుడు ఆమె మెడపై బ్లేడ్ ఉంచి అరిస్తే చంపేస్తానని బెదిరించగా, విజయ్ ఆమెపై అత్యాచారయత్నం చేయబోయాడు.

దీంతో బాలిక... వాళ్లకు ఏమాత్రం భయపడక బిగ్గరగా కేకలు వేయడంతో ఆ ముగ్గురూ కంగారుపడ్డారు. దీనిని అదనుగా తీసుకుని సదరు బాలిక వారినుంచి తప్పించుకుని సమీపంలోని అమ్మమ్మ ఇంటికి చేరింది. చికిత్స నిమిత్తం బాలికను కుటుంబ సభ్యులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
gang rape
west godavari
eluru
girl gang rape

More Telugu News